11, మార్చి 2024, సోమవారం

 Ep3


ఎపిసోడ్ నం. 3
సృష్టి ఎలా మొదలైంది
సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతి పుంజము ఒక రూపు దాల్చింది. తేజోమయమైన ఆ కాంతి పుంజమే పరబ్రహ్మము. అదే పరమశివుడు.

ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించాడు. తన శరీరములోని ఎడమభాగము నుండి ప్రకృతి స్వరూపిణిని సృష్టించాడు. ఆమే ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత, శక్తి ప్రాదుర్భామైన తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకముపైనా ఆసీనురాలిని చేసి, ఆమెను కౌగిలించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పము వల్ల నీలమేఘశ్యాముడు, నాలుగు చేతులు కలవాడు, ఆ చేతుల యందు శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడిన వాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టువస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు.

అతడు పీత వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు, సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ది చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి "ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశించి "నారాయణా! సర్వకాల సర్వావస్తలయందు ఈ మంత్రాన్ని జపించు. ఈ జగసృష్టిలో నీదే ముఖ్యపాత్ర" అని వివరించాడు.

విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరీ మంత్ర జపం చేస్తుండగా అశరీరవాణి ఇలా పలికింది "ఓయీ..! నారము నందుండుట చేత నీవు నారాయణుడ వనబడుదువు" అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్ధము. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి.

ప్రకృతి త్రిగుణాత్మకమైనది. అనగా సత్వరజస్తమోగుణములతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ చిఛక్త్యాత్మకమగు తన వీర్యమును. గుణ సంచలనము లేనప్పుడు ప్రకృతి యొక్క యోని యందుంచాడు. దీనివల్ల మహత్తత్త్వము పుట్టింది. మహత్తత్త్వము వికారము పొందటం వల్ల అహంకారము జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహత్తత్త్వము, అహంకారము వచ్చినాయి. అహంకారము నుండి పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంధాలు. వాటి నుండి పంచభూతాలు (పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము), వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి.

ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్త్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహా పద్మము ఒకటి ఆవిర్భవించింది. ఓం నమశ్శివాయ


8, ఫిబ్రవరి 2023, బుధవారం

 

శివుడు బ్ర‌హ్మాచారిగా వెలిసిన క్షేత్రం

కోట‌ప్ప‌కొండ చూద్దాం రండి

---------

శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ క్షేత్రం  కోటప్పకొండ. ఘాట్ రోడ్డు ద్వారా ప్రయాణం ఉంటుంది. ఒక్కో మలుపులో ఒక్కో అద్బుతం ఉంటుంది. మొదటి మలుపులో బ్రహ్మదేవుని విగ్రహం, అ తరువాతి మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి,ఆదిశేషుని విగ్రహాలను చూడవచ్చు.

ఘాట్ రోడ్డు ప్ర‌యాణంలో ముందుకు వెళ్లిన తర్వాత పెద్ద స్వాగత ద్వారం ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడే కాళీ మ‌ర్థ‌న విగ్ర‌హంతో పాటు పక్షుల కేంద్రం, బోటింగ్, ట్రైన్ జర్నీ ఉంటాయి, ప్రస్తుతం ఆదివారం మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఘాట్ రోడ్డు ప్రయణం ఎంతో ఆహ్లాడకరంగా ఉంటుంది. ఆ తరువత వచ్చే మలుపులో పార్వతి, లక్ష్మీ, సరస్వతి దేవిలను రాక్షస స్త్రీలు నెత్తిన పెట్టుకుని ఉన్నట్లు విగ్రహాలు కనిపిస్తాయి.చివరగా కొండ పైకి వెళ్ళగానే మరో స్వాగతద్వారం కనిపిస్తుంది. ఆ పక్కనే వినాయకుని విగ్రహం ఉంటుంది. స్వామికి నమస్కరించి ఎదురుగా చూస్తే మేధా దక్షిణామూర్తి ఆలయం క‌నిపిస్తోంది.


ఆక్కడికి వెళ్లడానికి ముందే మరో విగ్రహం ఉంటుంది. అయనే బ్రహ్మచారిగా ఉన్న దక్షిణామూర్తి. వేద జ్ఞానాన్ని రుషులకు పంచుతున్నట్లు కనిపిస్తుంది. కొంచం ముందుకు  వెళితే మేథా దక్షిణామూర్తి విగ్ర‌హం వున్న‌ ఆలయం కనిపిస్తుంది. కానీ ఈ కోట‌నప్ప కొండ‌కు వెళ్ళగానే ముందుగా దర్శించుకోవాల్సింది స్వామి వారి భక్తురాలు అయిన ఆనందవల్లి అమ్మవారిని.  ఆనందవల్లి అమ్మవారి ఆలయం ఇదే చూడండి. ఎలాంటి కోరికలు అయినా సరే ఈ అమ్మవారికి చెప్పుకుంటే ఈమే స్వామికి విన్నవిస్తుంది. అమ్మవారి విశిష్ట‌త‌, స్థ‌ల పురాణం గురించి పూజారిగారి మాటల్లో వినండి.


ఈ గుడికి ఎదురుగా భక్తులు కోరికలు చెప్పి చెట్టుకు మోడుపులు కట్టడం, రాళ్లను ఒక దానిపై ఒకటి పేర్చ‌డం చేస్తారు. ఆనంద వల్లి అమ్మవారి దగ్గర కష్టాలు చెప్పుకుని వెనక్కి రావాలి, ఆలయానికి ముందు నంది విగ్రహం పెద్ద‌గా ఉంటుంది. ఆ పక్కనే ప్రసాదం కాంటర్ ఉంటుంది. ఇక్కడ ఆరిసె ప్రసాదం ప్రత్యేకం. ఆనంతరం విగ్రహ రూపంలో ఉన్న మేథా దక్షిణామూర్తిని దర్శించుకుని, ఆ తారువాత‌  లింగరూపంలో వున్న స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఆలయం పైనుంచి చూస్తే మూడు కొండ‌లు క‌నిపిస్తాయి. ఇక్కడ కొలువైన స్వామిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. లింగ రూపంలో వున్న ఈ స్వామిని మీరూ ద‌ర్శించుకొండి. ఆలయం నుంచి కొద్దిగా పైకి వెళితే ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం కొండ కింది వరకు కనిపిస్తుంది. ఈ కొండ‌పైనే నాగేంద్రస్వామివారూ, మరియు నాగులు కనిపిస్తాయి. సంతానం కోసం భ‌క్తులు పూజ‌లు ఇక్క‌డే చేస్తారు.


ఈ ఆల‌యంపై మ‌రికొన్ని ప్ర‌త్యేక‌త‌లు :

కోటప్ప కొండపై కాకులు వాలవు

ఈ కొండ ఎత్తు 1587 అడుగులు

ఆలయం ఎత్తు  600 అడుగులు

కోటప్పకొండ అంటే మూడు శిఖరాలు, వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వ‌రూపాలుగా భావిస్తారు.

ఈ క్షేత్రంలో అమ్మవారి ఆల‌యాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఇదొక్కటే.

ఈ స్వామిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది, ఇతర గ్రహాల ప్రభావం తగ్గుతుంది, అందువ‌ల్ల మ‌నిషి జీవ‌తం హాయిగా సాగుతుంది.

ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.


చూశారుకదా త్రికుటాచలేశ్వరుని ఆలయ విశేయాలు మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరికి share చేయండి. వారాహీ య్యూటూబ్ చాన‌ల్‌, మ‌రియు పేజెస్‌ని ఫాలో చేయండి.. హార హార మహాదేవా శంబో శంకరా...

25, అక్టోబర్ 2022, మంగళవారం

 ఎటువంటి కారణాల వల్ల తులసి వాడిపోతుంది..? 


మట్టిలో దోషం ఉన్నా ఎండ సరిగ్గా తగలకపోయినా నిర్దిష్ట సమయానికి నీరు పోయకపోయినా వాడిపోతుంది. 

బహిష్టు మైల సమయాలలో తులసి దగ్గరకు వెళ్ళినా తులసిని తాకినా తులసి వాడిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు బాధపడుతున్న, హింసకు గురవుతున్న ఇంట్లో తులసి వాడిపోతుంది. ఉతికిన బట్టలు ఆరవేసిన నీరు తులసికి తగిలినా, తులసి ఉండే కుండీలో వేరే మొక్కలు పెరిగిన తులసి వాడిపోతుంది. 




హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు తాకవచ్చా..? 


హనుమంతుడి విగ్రహన్నే కాదు దేవాలయాలలోని ఏ దేవతా విగ్రహన్నైనా స్త్రీలు, పురుషులు ఎవరూ తాకకూడడు. దేవాలయంలో అర్చకులు తప్ప ఎవరూ విగ్రహాన్ని తాకకూడడు. దేవాలయ అర్చకులు కూడా దేవుని విగ్రహాన్ని అర్చన చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ విగ్రహాన్ని తాకకూడదు. 


వాడిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి.


వాడిపోయిన తులసి మొక్కను ఎండబెట్టి చుట్టుపక్కల ఏమైనా యజ్ఞాలు, హోమాలు జరుగుతుంటే అక్కడ ఆ అగ్నిలో వేయవచ్చు. లేదా మొక్క మరీ పెద్దగా ఉంటే తులసి పూసలు చేసుకుని తులసిమాల చేసుకోవచ్చు. లేదా ప్రవహిస్తున్న జలాశయాలలో నీటిలోగాని నదులలో గాని వదలవచ్చు. లేదా ఎవరూ ముట్టుకోని చోట ఎవరూ తిరగని చోట వేయవచ్చు. పందులు తిరిగేచోట, పెంటకుప్పలపైనా వేయకూడదు.



ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదా..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు, పచ్చిమం వైపు తలపెట్టి నిద్రించకూడదు అని మార్కండేయ పురాణంలోని మదాలస కథ ద్వారా తెలుస్తుంది. మదాలస అలర్కడు అనే తన కొడుకుకి సదాచారాలు చెప్తూ ఇలా అంటుంది

" కుమారా నిద్రించేటప్పుడు తల తూర్పు దిక్కున గాని, దక్షిణ దిక్కుకు గాని పెట్టి నిద్రించు. ఎటువంటి పరిస్థితులలోనూ పడమర వైపు గాని ఉత్తరం వైపు గాని తల పెట్టి నిద్రించకు. అలా నిద్రిస్తే నీకు కీడు కలుగుతుంది.

కాబట్టి పడుకునేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణ దిశగా పెట్టి నిద్రపోవాలి.

(ఈ మధ్య కొందరు సొంత ఊరిలో ఒక దిక్కున తల పెట్టి పడుకోవాలి, వేరే ఊరిలో ఉంటే వేరే దిక్కుకు తల పెట్టాలి అని జనాలను అయోమయంలో పడేస్తున్నారు. కానీ దానికి ఎటువంటి శాస్త్ర పురాణ ఆధారాలు లేవు.) ఈ విషయాలు మార్కండేయ పురాణంలోనివి. 


10, ఆగస్టు 2022, బుధవారం

భక్తి తొమ్మిది రకాలు

 భక్తి తొమ్మిది రకాలు

శివపురాణానికి స్వాగతం. శివుని మహిమలను వివిధ భాగాలుగా వింటున్న మీ అందరికీ ఆ ప‌ర‌మేశ్వరుని క‌టాక్షాలు ల‌భించాల‌ని కోరుతూ.. ఈ వీడియోలో మహాదేవుడు స‌తీదేవికి బోధించిన తొమ్మిది ర‌కాల భ‌క్తి ప‌ద్ద‌తుల గురించి తెలుసుకుందాం.. ఈ వీడియోని చూసే ముందు కామెంట్‌లో ఓం న‌మ‌శివాయా అని రాసి విన‌గ‌ల‌రు. స‌తీదేవి శివుని వివాహం జ‌రిగిన త‌రువాత దాక్షాయ‌ణికి శివుడు ఇలా చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. 

"ఓ సతీదేవి! భక్తికీ జ్ఞానానికీ అట్టే భేదం లేదు. కానీ భక్తే ఒక చూపు వాసిగా చెప్పుకోవలసి వస్తుంది. జ్ఞానంవల్ల ఐహికం అర్ధరహితమౌతుంది. భక్తులకు మాత్రం పరంతోబాటే ఐహికసుఖం కూడా అనుషంగికంగా అనుభవిస్తుంది. ఈ భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది.

----------------------------------------------



మొద‌టిది శ్రవణం :- ఇతరుల ద్వారా నా గురించి వినడం. రెండ‌వ‌ది కీర్తనం : అంటే తనకు తానై నన్ను స్తుతించడం. ఇక మూడ‌వ‌ది స్మరణం :- ఎప్పుడూ నన్నే తలపులో వుంచుకోవడం, నామ జపం చేయడం. నాలుగ‌వ‌ది సేవనం :- రోజుకు ఐదు పర్యాయాలు వాక్కులతో స్తుతిస్తూ, చేతులారా నన్ను పూజించడం. అనంత‌రం ఐద‌వ‌ది దాస్యం:- అంటే నేను వినడం లేద‌ని తెలిసి కూడా నా సేవ తప్ప వేరు యెరుగక సర్వదా నాకు ప్రీతికరాలైన పనులు చేయడం. అనంత‌రం ఆర‌వ‌ది అర్చన:- తగిన సమయాలలో అర్ఘ్యపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. త‌రుప‌రి ఏడ‌వ‌ది వందనం:- నామంత్రోచ్చారణతో నా ధ్యానంతో మనో వాక్కాయశుద్ధిగా వక్షం, శిరసు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. ఇక ఏనిమిద‌వ‌ది. సఖ్యం:- ఏది జరిగినా అది తన మేలుకోసమే అని త‌ల‌చి నాచే జరిపించబడినట్లు భావించడం సఖ్యం. చివ‌రిగా మిగిలింది తొమ్మ‌ద‌వ‌ది ఆత్మార్పణం:- త‌న‌ శరీరంగాని, మరొకటి గాని తమవనే భావన ఉంచుకోకుండా, దేహ పోషణకై దేవుళ్ళాడి పోకుండా, భారం నామీద పెట్టి  నాచేత‌ యీయబడిన బ్రతుకు కొనసాగించడమే ఆత్మార్పణం.


ఈ తొమ్మిది రకాల భక్తిలో దేనిననుసరించినా నాకు ఆనందమే. దాక్షాయ‌ణీ మ‌రోక విష‌యం బిల్వ సమీకరణాది ఉపాంగాలు కూడా కొన్ని వున్నాయనుకో కానీ ఏదిఏమైనా *భక్తి ప్రధానం* భక్తి రహితమైన జ్ఞానం ఎందుకూ కొరగాకుండా పోతుంది. భక్తి - ఎటువంటి వారికైనా మోక్షార్హతని అనుగ్రహిస్తుంది. మూడు లోకాలూ, నాలుగు కాలాలా కూడా భక్తియే ఉత్తమమార్గం, మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికీ పున్న ప్రాధాన్యత మరి దేవికి పుండదు. ఆ యుగంలో జ్ఞానవైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి యెక్కువగా వుపయోగపడకపోవచ్చు.

భక్తులు విన్నా నాకేమీ లేదు. భక్తులే నా సంపద, నాస్థితి ,నాగతి, భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను. ఇంతెందుకు దాక్షాయణీ!.. సతీపతి నన్నది భక్తులు పిలిచే పిలుపేగాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి అని శివుడు చెప్పినది విని సతీదేవి శివునియందు భక్తిని ఇంకా పెంచుకుంది. అనంతరం మంత్రం, తంత్రం, యంత్రం జ్యోతిష, సాముద్రికాది శాస్త్రాలను కూడా శివుని బోధించాడు. ప్రశ్నించి శివునివల్ల అనుగ్రహింపబడినది. లోకోపకారార్ధం వారలా తర్కించు కుంటారేగాని ఆ సతీ శివులు విడదీయరాని వారు. కొన‌సాగింపు వీడియోతో క‌లుసుకుందాం ఓం న‌మ‌శివాయా..



6, ఆగస్టు 2022, శనివారం

వెంకటేశ్వర స్వామి ఏ యుగంలో భూమి పైన జీవించారు?

వెంకటేశ్వర స్వామి ఏ యుగంలో భూమి పైన జీవించారు?

ఓం నమో వేంకటేశాయ🙏\


శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల కొండపై కేవలం కలియుగంలోనే కాదు కృతయుగం నుంచి ఉన్నాడు. ఆనందనిలయ విమానం ప్రత్యక్షమవుతూ అదృశ్యం అవుతూ ఉండేది. వేంకటాచలం పై భక్తులు కానీ, దేవతలు ప్రార్థించినప్పుడు కానీ ఆయన విమానంలో ప్రత్యక్షమవుతూ వారిని అనుగ్రహించిన తర్వాత విమానంతో సహా అదృశ్యమవుతూ ఉండేవారు. ఇలాంటి ఘట్టాలు మనకు పురాణాలలో చాలానే కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని చూద్దాం.


త్రేతాయుగంలో రాక్షస బాధలు పడలేక, లోకకళ్యాణం చేయమని ప్రార్థించడానకి దేవతలు, బ్రహ్మదేవుడు వెళ్ళారు. శివుడు కూడా వారి వెంట వెళ్లాడు. వేంకటాచలం పై విష్ణువును ప్రార్థించారు. వేంకటాచల మాహాత్మ్యం విన్న దశరథ మహారాజు కూడా తిరుమల కొండకు వెళ్లి పుత్ర సంతానం కోసం శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు వారందరికీ విమానం ప్రత్యక్షమైంది. విమానంలోకి వెళ్ళగా తన దేవేరులతో శ్రీ వేంకటేశ్వరుడు వారికి ప్రత్యక్షమై తన అవతార స్వీకారం చేసి రావణుడిని సంహరిస్తానని వరం ఇస్తాడు. దశరధునికి శ్రీవారు వరమిస్తూ తన అంశతో నలుగురు కొడుకులు పుడతారని వరమిచ్చాడు. అలా ఆయనకు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు పుట్టారు. వేంకటాచలం గురించి విన్న జనకమహారాజు కూడా శేషాద్రికి వెళ్లి స్వామిని స్తుతించాడు.

-----------------------------------------------

తిరుమల కొండపై వైకుంఠ గుహ ఉన్నదని శ్రీరాముడే చెప్తాడు. సీతమ్మ జాడను వెతుక్కుంటూ వెళ్తున్న వానరులు, రామలక్ష్మణులు వేంకటాచల పర్వతానికి వెళ్ళారు. గుంపులు గుంపులుగా వానరులు కొండపై తిరుగుతుండగా కొందరు ఒక గుహలోకి వెళ్ళారు. అక్కడ వారు దివ్య పురుషుల్ని చూసారు. గుహలో లోపలికి వెళ్ళగా సింహాసనం పై అధిష్టించి ఉన్న లక్ష్మీనారాయణులను చూసారు. కానీ వారు ఎవరన్న విషయం తెలియక బయటకు వస్తారు. మరి కొంతమంది వానరులకు చెప్పి అందరూ లోపలికి వెళ్తారు. అప్పుడు వారికి అక్కడ ఏమీ కనపడదు,‌‌ ఎవ్వరూ ఉండరు. ఆశ్చర్యానికి లోనై వారు రాముని వద్దకు వెళ్లి జరిగింది అంతా చెప్పారు. దానికి రాముడు ఈ విధంగా చెప్తాడు ఈ కొండపై శ్రీమన్నారాయణ ఎప్పుడు శ్రీ, భూ, నీళా దేవులతో విహరిస్తూ ఉంటాడు. ఇది ఆయన క్రీడాద్రి. మీకు గుహలో కనపడింది కూడా శ్రీహరే!


ఒకసారి శేషాద్రి పై కొందరు ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ కొండపైనే విహరిస్తున్న నారాయణుడు లక్ష్మికి అది చూపించి అక్కడికి వెళ్ళాలని సంకల్పించి, మానవ రూపాలతో అక్కడికి వెళ్తారు. ఋషుల వారిని లోపలికి ఆహ్వానించారు. హవిస్సులు సమర్పించినప్పుడు వారిద్దరూ లక్ష్మీనారాయణులుగా ప్రత్యక్షమై స్వయంగా హవిస్సులను స్వీకరించి, అంతర్ధానం అవుతారు. అప్పుడు ఋషులు 'ఓహో వచ్చింది సాక్షాత్తు శ్రీదేవితో కూడిన శ్రీ వేంకటేశ్వరుడు! ఈ కొండపై చేయబట్టి కదా వారిద్దరు వచ్చి స్వయంగా హవిస్సులు తీసుకొని, మనల్ని ధన్యులను చేశారు' అని సంతోషించారు.


ఇప్పటివరకు ఇతర యుగాల గురించి చూశాం. ఇప్పుడు కలియుగం గురించి చూద్దాం. కలియుగరంలో వెంకటేశ్వరరావు మాట్లాడేవాడని తొండమాన్ చక్రవర్తి కథ ద్వారా తెలుస్తుంది. తొండమానుడి వల్ల జరిగిన ఒకానొక సంఘటన కారణం చేత వేంకటేశ్వరుడు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే అర్చకులను ఆవహించి కానీ, స్వప్న సాక్షాత్కారం ద్వారా కానీ చెప్తానని అన్నాడు. కానీ పరమ భక్తులైన వారికి దర్శనం ఇవ్వకుండా ఆయన కూడా ఉండలేడు! అందుకు వెంగమాంబ వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇక చాలామంది ఆనంద నిలయంలో ఉన్నది కేవలం విగ్రహం అని భావిస్తారు అది ఖచ్చితంగా తప్పు అది విగ్రహం కాదు అని మన పురాణాల్లో స్పష్టంగా ఉంది.


న కృతం దైవసంఘైశ్చ

న కృతం విశ్వకర్మణా

స్వేచ్ఛయ క్రీడతే తత్ర

ఇచ్ఛారూపం విరాజితః


ఆనంద నిలయంలో ఉన్న వేంకటేశ్వరుని మూలమూర్తి దేవతలు తయారు చేసింది కాదు. విశ్వకర్మ చేసినదీ కాదు. తన సొంత ఇచ్ఛతో వేంకటేశ్వరుడు శిలా రూపంలో దర్శనమిస్తున్నాడు.

తేజస్సుతో కూడిన ఆయన రూపాన్ని అనేక పాపాలు చేసే కలియుగంలోని ప్రజలు చూడలేరు. అందుకని అందరికీ తన దర్శనం కలిగి, వారు ధర్మ మార్గంలో నడిచి, ఉద్ధరింపబడాలని ఆయన ఏ తపస్సు లేని మనకు దర్శనమిస్తున్నాడు. నేటికీ ఆ కొండపై తన మహిమలను చాటుతున్నాడు. అయిన వద్దన్న అధర్మ మార్గంలో నడుస్తున్నా, మన అందరికీ ఆయన దర్శనమిస్తూ మనం మారాలని ఓర్పుతో ఆ కొండపైన అలానే నిలబడి ఎదురుచూస్తూ ఉన్నాడు.

అయినా శిలా రూపంతో ఉన్నాడంటే ఒకప్పుడు ఈ కొండ మీద ఉండి, తర్వాత శిలా రూపంలో వెలసి, వైకుంఠానికి వెళ్ళాడు అని అర్థం కాదు. దీన్ని బట్టి ఆయన ప్రతి యుగంలోనూ ఈ భూమిపై ఉన్నాడు. కలియుగంలో శిలారూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. ఆయన దర్శనం చేసుకునేటప్పుడు అనంతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆయన విమానం పేరు ఆనందనిలయ విమానం! ఆయనను ప్రత్యక్షంగా చూసే అంత తపస్సు మనకు ఉంటే ఖచ్చితంగా ప్రత్యక్షంగా కనిపిస్తాడు. అందుకు అన్నమయ్య, వెంగమాంబ, హాథీరాం, ప్రసన్నవేంకటదాసు వంటి ఎందరో మహనీయుల జీవితం ఉదాహరణ.

స్వర్గం వద్దన్న ముద్గలుడి క‌థ విన్నారా..

 స్వర్గం వద్దన్న ముద్గలుడు

-----------------------------------------------------------------------

ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్య, కుమారుడితో కలసి ఉండేవాడు. ఏడాదిలోని మూడువందల అరవై రోజులూ ఏదో ఒక వ్రతదీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ, భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష చేపట్టాడు. ఉభయ పక్షాల్లోనూ పాడ్యమి నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవపూజ, పితృపూజ చేసేవాడు. ఆ పద్నాలుగు రోజులూ ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమినాడు, కృష్ణపక్షంలో అమావాస్యనాడు అతిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్యా కొడుకులతో కలసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు. 

---------------------------------------------------------------------

ముద్గలుడు ఇలా కాలం గడుపుతుండగా, ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానాదికాలు చేసి ఎన్నాళ్లో అయినట్లుగా అతి అసహ్యకరంగా ఉన్నాడు. జుట్టు విరబోసుకుని, మురికి కౌపీనంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సోలిపోతూ ఉన్నాడు. అతణ్ణి చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని, మిగిలినది ఒళ్లంతా పూసుకుని, మాటా పలుకూ లేకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు.



mudgudu

---------------------------------------------------------------

ముద్గలుడి ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. చక్కగా విస్తరివేసి భోజనం పెడితే, తిన్నంత తినడం, మిగిలినదంతా ఒంటికి పూసుకుని వెళ్లిపోవడమే! దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు. పరుషంగా మాట్లాడటం కాదు కదా, కనీసం మందలించనైనా లేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారీ ముద్గలుడు అతణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోపమూ లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు దుర్వాసుడు. 

-------------------------------------------------------------------------------------

‘ముద్గలా! నీ తపస్సుకు, సహనానికి, శాంతానికి, ధర్మనిష్ఠకు నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీవంటి తాపసులు ముల్లోకాల్లో ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్యవిమానం ఇప్పుడే వస్తుంది. స్వశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు’ అని చెప్పి వెళ్లిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్లుగానే ముద్గలుడి ముందు దివ్యవిమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగివచ్చి, ముద్గలుడికి వినమ్రంగా ప్రణమిల్లాడు. ‘మహర్షీ! అనన్యమైన నీ తపశ్శక్తి ఫలితంగా స్వశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచెయ్యి. నాతో కలసి విమానాన్ని అధిరోహించు. నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను’ అన్నాడు.


‘మహాత్మా! స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది? అక్కడి మంచిచెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది. కుతూహలం కొద్ది అడుగుతున్నానే గాని, నిన్ను పరీక్షించడానికి కాదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ముద్గలుడు. ‘ఈ మర్త్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వదిశలో ఉంది స్వర్గలోకం. సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాలంకార భూషితమై, దివ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్లు, సత్యనిష్ఠతో జీవితం గడిపినవాళ్లు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాలను జయించిన ఉత్తములు మాత్రమే స్వర్గార్హత సాధించగలరు.


అలాంటి వాళ్లు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నెలవుల్లో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరా వ్యాధి మరణాలేవీ ఉండవు. ఆకలి దప్పులుండవు. వేడీ చలీ ఉండవు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాలన్నీ నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి’ చెప్పాడు దేవదూత.

-------------------------------------------------------------------------

‘అయినా, స్వర్గం మంచిచెడులు అడిగావు కదూ! ఇప్పటివరకు స్వర్గంలోని మంచివిషయాలన్నీ ఏకరువు పెట్టాను. ఇక స్వర్గానికీ పరిమితులు ఉన్నాయి. అవి కూడా చెబుతాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్నే మనుషులు స్వర్గంలో అనుభవిస్తారు. అక్కడ మళ్లీ పుణ్యం చేయడానికి అవకాశం ఉండదు. భూమ్మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే, స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్లీ భూమ్మీద జన్మించవలసిందే!


అలవాటైన సుఖాలను వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో! పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమ్మీద పుడతాడు. బ్రహ్మలోకం తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమ్మీదకు తరిమివేయడబడ్డ మనిషి సుఖవంతుడిగానే పుడతాడనుకో! ఎందుకంటే భూలోకం కర్మభూమి, మిగిలిన పుణ్యలోకాలన్నీ ఫలభూములు. ఇదీ సంగతి. మంచివాడివని ఏదో నీ మీద ఆదరంతో ఇవన్నీ నీతో చెప్పాను. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక దయచెయ్యి. స్వర్గానికి బయల్దేరుదాం’ అన్నాడు దేవదూత. 


అంతా విని కాసేపు ఆలోచించాడు ముద్గలుడు. ‘అలాగైతే, ఆ స్వర్గం నాకొద్దు. ఏదో రమ్మని ఆదరంగా పిలిచావు. అదే పదివేలు అనుకుంటాను. ఆ స్వర్గసౌఖ్యాలేవో దేవతలకే ఉండనీ. జపతపాలు చేసుకునే నాకెందుకవన్నీ? వెళ్లు. నీ విమానం తీసుకుని వచ్చినదారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్లీ తిరిగి భూమ్మీదకు రాకుండా ఉంటాడో అలాంటి ఉత్తమలోకం కావాలి నాకు. అంతేగాని, పుణ్యఫలాన్ని కొలతవేసి, అంతమేరకు మాత్రమే దక్కే తాత్కాలిక స్వర్గమెందుకు నాకు? శాశ్వతమైన ఉత్తమలోకమే కావాలి నాకు. అలాంటిదానికోసమే ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాను’ అన్నాడు ముద్గలుడు. దేవదూత ఎంత బతిమాలినా పట్టించుకోకుండా, అతణ్ణి సాగనంపాడు. 

-----------------------------------------------------

దేవదూతను సాగనంపిన తర్వాత ముద్గలుడు యాచకవృత్తిని కూడా వదిలేశాడు. పరమశాంత మార్గం అవలంబించాడు. నిందాస్తుతులకు చలించడం మానేశాడు. మట్టినీ బంగారాన్నీ ఒకేలా చూసేటంతగా ద్వంద్వాతీత స్థితికి చేరుకున్నాడు. పూర్తిగా తపస్సులోనే మునిగిపోయాడు. నిర్వికల్ప జ్ఞనాయోగంతో తుదకు మోక్షం పొందాడు.

శివుడిని అవ‌మానించిన ద‌క్షుని క‌థ‌

మీరు చూస్తున్న‌ది శివ‌పురాణం

శివుడిని ఎలాగైనా స‌రే అవ‌మానించాల‌ని ద‌క్షప్ర‌జాప‌తి ఒక ఆలోచ‌న చేశాడు. అందులో భాగంగా ఒక యజ్ఞం చేయాల‌ని సంక‌ల్పించాడు. ఆ యఒ్ఙానికి ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా యజ్ఞం  ప‌నులు మొద‌లు పెట్టాడు. సామాన్యదేవతలతో పాటు అగ్రదైవాలు, మహామునులను కూడా పిలిచాడు. హరిద్వార సమీపంలో ఒక క్షేత్రాన్ని యెంచుకున్నాడు. ఒక్కొక్క‌రిగా ఆ యఒ్ఙానికి రావ‌డం మొద‌లు పెట్టారు.  వచ్చిన వాళ్ళందరికీ స్వాగ‌తం ప‌లికి, పేరు పేరునా ప‌క‌ల‌రించి వారికి విడుదులు ఏర్పాటు చేశాడు. భృగ్వాదులు మొత్తం యైనభై ఎనిమిది వేలమందీ ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్గాతలు, ఆధ్వర్యులు హోతలూగా అరవై నాలుగు వేలమంది నియమింపబడ్డారు. ఋషిసప్తకం “గాధ” అంటే వేదాంతర్గత చరిత్రములను గానం చేయసాగింది. దిక్పాలకులే యజ్ఞరక్షకులు. యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా వెలుగుతుంది. అహుతులు స్వీకరించే నిమిత్తం అగ్ని తన వేనాల్కలతో ప్రజ్వరిల్లిపోతున్నాడు.



-----------------------------------------------------------------------------------

సర్వశుభ సంజ్ఞలాంఛితమైన మహాపురుషుడి దివ్యదేహంలా ఉంది ఆ ప్రాంత మంతా!. ఎటోచ్చి పుర్రెలు ధ‌రిస్తాడు గనుక శివుణ్ణి, ఆయనతో కాపురం చేస్తుంది గనుక అంబనీ ఆహ్వానించలేదు. అంతమందీ వచ్చినా కూడా ఆ ల‌య‌కారుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు దధీచి. వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు. ఏమోయ్ దక్షా!.. ఇంతకూ ఆ ల‌య‌కారుడు లేకుండా యాగం జరిగితోందేమిటి? సమస్త అమంగళ ప్రశమనుడు, సర్వమంగళప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు. ఆయనెందువల్ల రాలేదో మరి. ఆ బ్రహ్మతోనో, విష్ణువుతోనో లేదా అర్హులైన ఋషిగణాలతోనో ఓ పిలుపు పిలిపించు. సాంబశివుణ్ణి రప్పించు.. ఆలస్యం అవుతుంద‌న్నాడు.. అలా అంటున్న దధీచి మాటలు ఏకోశానాన నచ్చలేదు దక్షుడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఆయనేమంత ఘనుడని ప్రత్యేకంగా కబురుపెట్టాలి. అహూతులెవరూ ఆయనకు తీసిపోరు అయినా వల్లకాట్లో మసలేవాడూ, చితాభస్మధారుడూ, అస్థిలాభూషణుడూ, పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు. అయినా అప్పట్లో ఏదో బ్రహ్మమాటకొట్టేయ లేక కూతుర్నిచ్చి పెళ్లి చేశానేగాని అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు. కావాలనే పిలువలేదు నేను. 

ఆ గొడవ ఆపి వచ్చినవాళ్లు, మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి" అన్నాడు ద‌క్షుడు. మెల్ల‌గా న‌వ్వాడు దధీచి 'ఇక నువ్వు యఒ్ఙం చేసినట్టేలే!.. అనేసి అక్కడి నుంచి బ‌య‌లుదేరుతూ. “శివుణ్ణి నిరాకరించినచోట నిమిషం కూడా నిలువబోనని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అయినా చలించలేదు దక్షుడు. శివుడేకాదు శివ ప్రియులైన ఈ దధీచిలాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి. మంచిది పోతేపోనివ్వండి. శుద్ధ విష్ణుపరాయణులూ, వేదమార్గ ప్రవర్తకులూ అయిన వాళ్ళే నాకు చాలు. మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అని అక్క‌డి వారితో అన్నాడు. దధీచితో పాటు మ‌రికొంత మంది బ‌య‌లుదేరుతూ శివుడు లేని చోట మేముకూడా ఉండ‌ము అని చెప్పి వెళ్లిపోయారు. ఇక పోయిన వారు పోగా మిగిలిన వారు  యజ్ఞానికి సిద్ద‌మ‌య్యారు.

ఇక త‌రువాతి వీడియోలో ద‌క్ష య‌గ్నానికి స‌తీదేవి బ‌య‌లుదేరుట గురించి తెలుసుకుందాం. ఓం న‌మ‌శివాయా..

శివునిపై దక్షుడి అలక

శివుని పై దక్షుడి అలక


ఒకానొక స‌మ‌యంలో కొందరు మునులు కలసి ప్రయాగక్షేత్రంలో యజ్ఞం చేయసాగారు. ఆ యజ్ఞానికి సనక సనందాది సిద్దులు నారదాది దేవర్షులు, మరీచ్యాది ప్రజాపతులు ఇలా ఒకరేమిటి? రాదగ్గ వాళ్లంతా వచ్చారు. సాక్షాత్తూ శివుడు కూడా వచ్చాడు. ఈశ్వ‌రుడిని చూడ‌గానే అక్క‌డ వున్న వారంతా లేచి న‌మ‌స్కారం చేశారు. కాసేపు శివుడిని ప్రార్థించి వారంతా ధ‌న్యులు అయ్యారు. ఆ త‌రువాత శంక‌రుడు త‌న‌కు కేటాయించిన ఆస‌నంపై ఆసీనుల‌య్యారు. శివుని ప్రార్థ‌న త‌రువాత అక్క‌డి వాతావ‌ర‌ణం చాలా ప్రశాంతంగా ఉంది. 

-------------------------------------------------------

మరికొంత సేపటికి దక్షప్రజాపతి కూడా వచ్చాడు. వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు. ఆయనను చూసి అందరూ లేచారు. నమస్కరించారు. దక్షుణ్ణి కీర్తించారు. అంద‌రూ ద‌క్షుడిని కీర్తిస్తుంటే మ‌రొప‌క్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలాగే కూర్చుని వుండిపోయాడు. దక్షుడికది అవమానంగా తోచింది. అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా మౌనంగా వుండడం ఆయనకు అస్స‌లు గిట్టలేదు. ఆ గిట్టని తనం తనలోనే దాచుకోలేక బైటపెట్టేశాడు. దేవ, దానవ, సిద్ధ, సాధ్య, ముని గణాలన్నీ నాకు మ్రొక్కులిడుతుండగా యీ భూత, ప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా మౌనంగా కూర్చుండి పోవడంలో అర్థం మేమిటి? నన్నఅవమానించడమేగా! అన్నాడు. అంత‌టితో ఆగ‌కుండా న‌న్ను గౌర‌వించ‌ని ఈ భూత నాధుడ్ని శపిస్తున్నాను. ఈ రుద్రుడు ధర్మబహిష్కృతుడై పోవాలి. యజ్ఞంలో పాల్గొనలేక పోవాలి. దేవతలతో సమానంగా హవిర్భాగం యితనికి చెందకుండా పోవాలి అని శపించాడు. ఆ మాట‌లు అన్నీ వింటున్న నందికేశ్వరుడు కలగచేసుకున్నాడు. ఎవరి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలూ సఫలాలైపోతున్నాయో, అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణాధమా! అన్నాడు. 



ఆ మాటలతో అగ్గిమీద గుగ్గిలం వేసినట్టు, భగుమన్నాడు దక్షుడు. నువ్వెంత వాడిని నాకు చెప్పడానికి! అసలు మీ రుద్రగణాలన్నీ వేదమార్గాన్ని పరిత్యజింతురు గాక, మహర్షి సంప్రదాయాలకు దూరమై పోదురుగాక, శిష్టాచార బహిష్కృతులై జటాభస్మధారులై చరింతురుగాక అని శపించాడు. 


నందికేశ్వరుడు మాత్రం యేమైనా తక్కువ తిన్నాడా? ఓరి శతుడా! మీ బ్రాహ్మణులంతా కేవలం వేదోక్త కర్మవాదులై పోవుదురుగాక. వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా వుండుగాక. అభిజాత్యహీనులూ యాచకులూ అయ్యెదరు గాక, నిత్యం దాన పరిగ్రహులయి దరిద్రులై పోవుదురుగాక, దుష్టదాన స్వీకరణాఘ సంతృప్తులై కొందరు నరక వాసులయ్యెదరు గాక మరికొందరు బ్రహ్మరాక్షసులయ్యెదురుగాక. శివుణ్ణి సర్వేశ్వరుడిగా కాక కేవలం త్రిమూర్తులలో ఒకడుగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్త్వజ్ఞాన హీనులగుదురుగాక! ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదలి పశుప్రాయుడిపై కేవలం కర్మనిష్టాపరుడివై-అతి త్వరలోనే ముఖుడివై అలరారెదవు గాక అని ప్రతి శాపం పెట్టేశాడు. ఈ శాపాల యుద్ధంలో అందరూ హాహాకారాలు చేశారు. 

బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు. శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు. యజ్ఞం అయిందనిపించి యెవరి దారిన వారి వారి స్వస్థానాలకు వెళ్లారు. రుద్రుడు రుద్రుడు అని ఒత్తి ఒత్తి పలకడమే గాని, నిజానికి సత్యగుణ సముద్రుడు గదా శివుడు. అందువల్ల ఆయన రుద్ర గణాలూ కూడా జరిగింది మర్చిపోయారు. కానీ దక్షుడు మాత్రం ఇదంతా మర్చి పోలేకపోయాడు. మనసులో కక్ష పెంచుకున్నాడు శివమాయా పరివృత్తుడై తామసంలో తలమునకలై పోయాడు. శివుడంతటి వాణ్ణి శిక్షించాలనుకున్నాడు. కొన‌సాగింపు ఉంటుంది గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఓం న‌మ‌శివాయా..

17, జులై 2022, ఆదివారం

కలియుగాంతం ఎప్పుడో చెప్పే ఆలయం

కలియుగాంతం ఎప్పుడో చెప్పే ఆలయం

పానకాల స్వామి మహిమ..


.......
మంగళగిరి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది పానకాల లక్ష్మీనరసింహాస్వామి ఆలయం.. ఆ తరువాత స్వామికి ప్రసాదంగా సమర్పించే పానకమే గుర్తుకు వస్తోంది. మనదేశంలో హిందువులు కొలిచే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అలాంటి చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. యుగాంతం ఎప్పుడు జరుగుతుందో తెలిపే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి.

గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన ఈ స్వామి మహత్యం అంతా ఇంతా కాదు. భక్తులు ఏది కోరుకున్నా ఇట్టే జరుగుతుందని ప్రతి ఒక్క భక్తుడు చెబుతుంటాడు.. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. ఒకటి కొండ కింద ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం. రెండవది కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం. కొండపైన వున్న దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు. కాని తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకున్న రంధ్రమే పానకాల స్వామిగా భక్తులు నమ్ముతారు. 

మంగళగిరి లక్ష్మీనారసింహా స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్వామికి పానకం అంటే మహా ఇష్టం.. అందుకే బెల్లం, పంచదార, చెరకుతో ప్రతి రోజు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తరువాత సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదిలిపెడతాడు. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. పానకాలస్వామికి ప్రతి రోజూ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. కాని పానకం తయారు చేస్తున్నప్పుడు ఒకవేళ కిందపడినా ఈగలు చీమలు అస్సలు చేరవు. 

సాక్ష్యాత్తు ఆ మహా విష్ణువు ఈ కొండపై వెలశాడని, లక్ష్మీదేవి ఈ కొండ శిఖరంపై తపస్సు చేసిందని భక్తులు నమ్ముతారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద పాండవ సోదరుడు అయిన యుధిష్ఠిరునిచేత స్థాపించబడిందని విశ్వసిస్తారు. ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం, ఆలయ విశిష్టత, చరిత్ర పాత హిందూ మత గ్రంథాలలో ఒకటైన బ్రహ్మ వైవర్త పురాణంలో పూర్తిగా వ్రాయబడింది.. ఈ దేవాలయాన్ని అప్పట్లో విజయనగర పాలకులు పోషించారని శాసనాల్లో వ్రాయబడింది.

శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తి చేసుకుని ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. 11 అంతస్తులు, 157 అడుగుల ఎత్తు కలిగి, 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడి భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. దీనిని 1807 - 09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతితో నిర్మించబడింది.

శాసన స్తంభం ప్రత్యేకత :
శాసన స్తంభం, ప్రధాన వీధిలో రామాలయం వద్ద ఉంటుంది. అందుకే ఈ వీధికి శాసన స్తంభం వీధి అని పేరు వచ్చింది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్‌లోను వ్రాసి ఉంటాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పన్నును తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులు కూడా నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించాడు. అదే విషయాన్ని ఈ శాసనంపై చూడవచ్చు. 

పెద్ద కోనేరు
మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరు ఉంటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉంటాయి. లక్ష్మీనారసింహా స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు కూడా ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంటుంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోంది. అప్పుడు 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయటపడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవని పురావస్తుశాఖవారు చెబుతున్నారు. ఈ కోనేటి అడుగున ఒక బంగారు గుడి ఉందని ప్రజలు బాగా నమ్ముతారు. ఇదే విషయాన్ని 1883లో గార్డన్  మెకెంజీ అనే అతను కృష్ణా జిల్లా మాన్యువల్‌లో రాశాడు. 

19వ శతాబ్ధంలో మారెళ్ళ శీనయ్యదాసు అనే అతను కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించాడు. దాంతోపాటు రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలు ఈ కోనేటి నీటితోనే దేవునికి అభిషేకాలు జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు. జయ స్తంభం, శ్రీ కృష్ణదేవరాయల శాసనం పానకాలస్వామి ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం మొదట్లో ఉంటాయి. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చాలా మంది చెబుతారు. కానీ వాస్తవానికి ఇది రాయల మహామంత్రి అయిన సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 సంవత్సరంలో జూన్  23వ తేదీన శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించాడు. ఆ విజయానికి గుర్తుగా ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అంటారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తి కూడా దీనిపై వ్రాయబడింది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు వ్రాయబడ్డాయి.

యుగాంతాన్ని సూచించే ఆలయం :
యుగాంతం దగ్గరపడుతుందని తెలిపే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అయితే ఇక్కడ స్వామికి నైవేద్యంగా సమర్పించే పానకమే అందుకు నిదర్శనం. ఆలయంలో పానకం కింద పడినా ఈగలు, చీమలు రావని ముందే తెలుసుకున్నాం కదా... ఎప్పుడైతే ధర్మం నశించి యుగాంతం జరగబోతుందో అప్పుడు సూచనగా ఈగలు, చీమలు, చేరతాయి... ఇక్కడి ఆలయంలో చీమలు, ఈగలు వచ్చాయంటే యుగాంతం దగ్గరపడుతుందని అర్థం. 

ఈ వీడియో మీకు నచ్చితే like, comment, Share చేసి, subscribe చేయగలరు.


అది 1940వ సంవత్సరంలో జ‌రిగిన క‌థ ఇది

అది 1940వ సంవత్సరంలో జ‌రిగిన క‌థ ఇది

అది 1940వ సంవత్సరం. ఒక వ్యక్తి మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు... శివ్యులను అగిడితే స్వామి ధ్యానంలో ఉన్నారు కూర్చొండి అన్నారు. అతని చేతిలో ఒక టేప్ రికార్డర్ ఉంది. అది చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కొంత సేపటి తరువాత స్వామి బయటికి వచ్చారు. శిష్యులు అతని గురించి చెప్పి స్వామి వద్దకు పంపించారు.


స్వామి నమస్కారం.. మిమ్మల్ని ఇంజర్య్వూ చేయడానికి వచ్చాను.. టేపిరికార్డర్ పట్టుకుని అడిగాడు. / అలాగే అని కూర్చున్నారు మహాస్వామి../ ఇటర్య్వూ అనగానే అక్కడ ఉన్న వారందరూ వచ్చి చుట్టూ కూర్చున్నారు. ఆ వ్యక్తి మహా స్వామిని ఏదో అడగబోతుంటే / వెంటనే స్వామి ఇలా అన్నాడు.. / నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు... / టేప్ రికార్డర్ స్వామి అన్నాడు.. / అవునా... ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏమిటో తెలుసా.. అన్నాడు.. / అతని నోటి వెంట మాట రాలేదు.. / వెంటనే మరో ప్రశ్న విష్ణు సహస్రనామం / మనకు ఎలా వచ్చింది అని అడిగారు. / అతనికి తెలియదు.. కాని శిష్యులలో ఒకతను టక్కున లేచి భీష్ముడు భోధించాడు స్వామి అన్నాడు.. / మరి భీష్ముడు భోధిస్తే ఎవరు వ్రాశారు అన్నారు మహాస్వామి.. / టక్కున కూర్చున్నాడు లేచినవాడు. అక్కడ వున్న అందరూ మహా స్వామి వైపు అమాయకంగా చూశారు. '


నాయనలారా... విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్పది... దాని గురించి పూర్తి వివరంగా చెబుతాను వినండి... అని మహా స్వామి చెప్పడం మొదలు పెట్టారు.. కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత / భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. / సుమారు నెలరోజులు తర్వాత / ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ / శ్రీకృష్ణుడు హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. / కాసేపు మౌనంగా నిల్చున్నాడు... / కంగారు పడిన పాండవులు కృష్ణా.. కృష్ణా... ఏమైంది అని కృష్ణుడిని అడిగారు. అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముడు / నన్ను స్మరించుకుంటున్నాడు... అందుకే నా మనస్సు అక్కడికి మళ్లింది. / పాండవులారా వెంటనే బయలుదేరండి / అక్కడకు వెళ్లాలి. అన్నాడు కృష్ణుడు.. / భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసన పట్టినవాడు అని చెప్పి పాండవులను వెంటబెట్టుకుని / భీష్ముని వద్దకు పరుగున వెళ్లారు.


కృష్ణుడిని చూడగానే భీష్ముడు ఎంతో సంతోషించాడు.. / కృష్ణా వచ్చావా.. అంటూ / అంపశయ మీద నుంచే ఆప్యాయంగా పలకరించాడు. / నాయనా ధర్మరాజా.. నీకు విష్ణు సహస్రనామాన్ని భోధిస్తాను శ్రద్ధగా విను.. / ఈ స్తోత్రం ఎవరైతే పారాయణం చేస్తారో / వారి కోరికలు తీరి విజయం వరిస్తుంది నాయనా ! అంటూ విష్ణు సహస్ర నామాలను కృష్ణుడి వైపు చూసి భోధించడం ప్రారంభించాడు. సహస్రనామాలు అంటే వేయి నామాలు.. / ఒక్కొక్క నామం కీర్తిస్తూ ఉంటే కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అందరూ అత్యంత శ్రద్ధగా వింటున్నారు. చివరికి వేయి నామాలను పూర్తి చేసి తన బాధ్యతను పూర్తి చేశాడు భీష్ముడు.. / భీష్ముడు చెబుతుంటే అందరూ విన్నారేగాని ఎవరకూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడు "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము / కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా  కృష్ణా" అని అడిగాడు. / అవును కృష్ణా ఈ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. / అప్పుడు శ్రీ కృష్ణుడు విష్ణు సహస్రనామాలను లికించాలంటే / సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది అన్నాడు.


“అదేలా” అని అందరూ ఆశ్యర్యంగా అడిగారు. / శ్రీ కృష్ణుడు ఇలా చెప్పాడు..! మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేక ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే / ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి మళ్లీ వినవచ్చు/ అప్పుడు వ్యాస మహర్షితో వ్రాయించవచ్చు / అని కృష్ణుడు సలహా ఇచ్చాడు. / శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు,/ ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోటు/ అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చున్నారు. / సహాదేవుడు స్పటికాన్ని పట్టుకుని శివుడిని ప్రార్థిస్తున్నాడు / అప్పుడు భీష్ముడు చెప్పిన మాటలు / మళ్లీ ఆ స్పటికం నుంచి వినిపిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా విని వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు. / ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం అయింది. / అని శ్రీశ్రీశ్రీ మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అందరికీ వివరంగా చెప్పారు. వచ్చిన వ్యక్తి కూడా టేప్ రికార్డుల్లో స్వామి మాటలను రికార్డు చేసుకుని వెళ్లాడు.....

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...